వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం ఖాయమని పలు మీడియా సంస్థలు ప్రకటిస్తున్న సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇటీవల ఓ మీడియా సంస్థ దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలలో అధిక భాగం కాంగ్రెస్ పరాజయం పాలవడం ఖాయమని తేల్చి చెప్పారట.
ముఖ్యంగా ఆకాశాన్నంటుతున్న ధరలకు కళ్లెం వేయడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందనీ, సామాన్య ప్రజానీకాన్ని అధోగతి పాల్జేసిందని తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సర్వే పేర్కొంది.
మరోవైపు అంతర్జాతీయంగా డీజిల్, పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ యూపిఏ సర్కారు ధరలను తగ్గించడంపై మీనమేషాలు లెక్కించి నడ్డి విరిచిందని సర్వేలో పాల్గొన్న ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక మన రాష్ట్రానికి వస్తే... వచ్చే ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెబుతోంది. గత ఎన్నికలలో చంద్రబాబు విధానాలను నిరసిస్తూ తాము వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓటు వేశామనీ, ప్రస్తుతం వైఎస్ విధానాలు సైతం జనామోదయోగ్యంగా లేవనీ, కనుక తమకు ప్రత్యామ్నాయం ప్రజారాజ్యం పార్టీయే అని సర్వేలో పాల్గొన్న అధిక ప్రజలు చెప్పారు.
అధికారం కోసం తమ విధానాలకు తిలోదకాలిచ్చి బద్ధ శత్రువులైన పార్టీలు ఒకటవడాన్ని చూసి తమకు విసుగు పుడుతోందని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో డజన్ల సంఖ్యలో ఉన్న పార్టీలు ఉండటం వల్ల ఏక పార్టీకి ఆధిక్యతం లభించడం అంత తేలికైన పనికాదని వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. |