ఏప్రిల్ నెలలో జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతివారికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్లు విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం పాటు పడాలని ఆమె పార్టీ శ్రేణులకు హితవు పలికారు. కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఎవరు పోటీ చేసినా వారందరికీ పూర్తి మద్దతుండాలని, పార్టీలో ఐకమత్యం, క్రమశిక్షణ ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. పార్టీ పట్ల ప్రజలలోనున్న సహృద్భావాన్ని ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో ఇందుకు విరుద్ధంగా అంతర్గత కలహాలతో ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుని, దూషించుకునేవారని, అలాంటి సంస్కృతికి అడ్డుకట్టవేయాలని ఆమె సూచించారు. ప్రాంతీయ, స్థానిక సమస్యల పట్ల స్పందించే జాతీయ దృక్పథం గల ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆమె పార్టీ నాయకులకు తెలిపారు. ముఖ్యంగా పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ అధికారంలోవుంటే ప్రతి కార్యకర్త అధికారంలోనున్నట్లేని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా ప్రతి కార్యకర్తకూడా సైనికునిలా రానున్న ఎన్నికలలో ప్రత్యర్థులపై పోరాడాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె కార్యకర్తలకు, నాయకులకు, సీనియర్ నాయకులకు పిలుపునిచ్చారు. |