మూడో కూటమిలో చేరినట్టు వచ్చిన వార్తలను బిజూ జనతాదళ్ (బీజెడీ) తోసిపుచ్చింది. ఇప్పటి వరకు తాము ఏవరికీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి దామోదర్ రౌత్ స్పష్టం చేశారు. అదేసమయంలో తాము ఎన్డీయే కూటమిలో ఇంకా కొనసాగుతున్నామని, కూటమితో పూర్తిస్థాయిలో తెగతెంపులు చేసుకోలేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఇదిలావుండగా, మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ బీజేడి అధినేత, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మూడో కూటమిలో చేరేందుకు సమ్మతించారని, ఈ విషయం ఆయనతో స్వయంగా తాను మాట్లాడి ఖరారు చేసుకున్నట్టు వెల్లడించారు.
దీనిపై బీజేడి అధికార ప్రతినిధి రౌత్ మాట్లాడుతూ.. గౌడ వ్యాఖ్యలను టీవీ ద్వారా విన్నాను. నవీన్ పట్నాయక్తో గౌడ మాట్లాడినట్టు తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారని గుర్తు చేశారు. అయితే, తాము మూడో కూటమి లేదా ఏ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఇలాంటి హామీ ఏ ఒక్క రాజకీయ పార్టీ నేతకు ఇవ్వలేదని ఆయన భువనేశ్వర్లో వెల్లడించారు.
తమది ప్రాంతీయ పార్టీ అని, భావసారూప్యత, సెక్యులర్ పార్టీలతో సీట్ల సర్దుబాటుకు చర్చలు జరుగుతాయన్నారు. బలపరీక్షా గండం నుంచి తమ ప్రభుత్వం ఇపుడే బయటపడిందని, ఇకపై అన్ని విషయాలపై కూలంకుషంగా చర్చిస్తామన్నారు. |