ఎన్నికల పోలింగ్ అనంతరం కాంగ్రెస్ లేదా భాజపా నేతృత్వాల్లో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని ఒరిస్సా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తృతీయ కూటమిలో చేరుతారనే సంకేతాలు పరోక్షంగా ఇచ్చినట్టేనని మూడో కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.
శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి ఏబి.బర్ధన్ భువనేశ్వర్కు వెళ్లి, నవీన్ పట్నాయక్తో సమావేశమయ్యారు. మూడో కూటమిలో చేరాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఆ తర్వాత పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం తమ పార్టీ కాంగ్రెస్, భాజపాల నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు.
అయితే మూడో కూటమిలో చేరడంపై ఇపుడే వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుందన్నారు. అయితే, ఎన్నికల తర్వాత ఒక స్పష్టత వస్తుందన్నారు. అప్పటి వరకు నవీన్కు సమయం ఇచ్చినట్టు బర్దన్ మరో ప్రశ్నకు జవాబిచ్చారు. సీట్ల పంపిణీలో తలెత్తిన మనస్పర్ధలు కారణంగా భాజపా-బీజేడీల మధ్య ఉన్న పొత్తు విచ్ఛిన్నమైన విషయం తెల్సిందే.
ఆ మరుక్షణమే సీపీఎం నేత సీతారం ఏచూరీ భువనేశ్వర్కు వెళ్లి నవీన్తో చర్చలు జరిపారు. మూడో కూటమిలో చేరాల్సిందిగా ఏచూరీ బీజేడీ చీఫ్ను ఆహ్వానించారు. ఇదిలావుండగా ఒక ప్రశ్నకు నవీన్ పట్నాయక్ సమాధానం ఇస్తూ తనకు ప్రధానమంత్రి కావాలనే ఆశలేదన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉంటూ, రాష్ట్ర ప్రజలకు చేయాలని ఆశపడుతున్నట్టు తేటతెల్లం చేశారు. |