సీనియర్ ప్రభుత్వాధికారిణిని బెదిరించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత ములాయం సింగ్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మెయిల్పురి జిల్లా కలెక్టర్తో దురుసుగా మాట్లాడినందుకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని ఈసీని బీజేపీ కోరింది.
కలెక్టర్ను మహిళ అని సంబోధించి మరీ అవమానపరిచారని, తద్వారా ఎన్నికల యంత్రాంగాన్ని అవమానపరిచారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. వరుణ్ గాంధీ విషయంలో ఎంతో చురుగ్గా వ్యవహరించిన ఎన్నికల సంఘం ములాయం సింగ్ విషయంలోనూ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వ సీనియర్ అధికారిణిని బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్నికల సంఘం కూడా దృష్టిసారించింది. వారంలోగా వైఖరి మార్చుకోవాలని లేదంటే ఎన్నికల సంఘానికి ఆమెపై ఫిర్యాదు చేస్తానని మెయిన్పురి జిల్లా కలెక్టర్ను ములాయం సింగ్ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. జిల్లా ఎన్నికల ప్రధాన అధికారిగానూ విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ ఆయుధ లైసెన్స్లు రద్దు చేయడం తాజా వివాదానికి దారితీసింది. |