వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ఆదివారం ప్రకటించింది. మొత్తం 39 స్థానాలకు గాను ఆ పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కరుణానిధి వెల్లడించారు. తన కుమారుడు. దక్షిణ జిల్లాల పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంకే.అళగిరికి టిక్కెట్ కేటాయించారు. ఆలయాల నగరమైన ముదురై లోక్సభ స్థానం నుంచి అళగిరి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
అలాగే, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలైన టీఆర్.బాలు, ఏ.రాజా, ఎస్ఎస్.పళనిమాణిక్యం, దయానిధి మారన్లకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే, ఇద్దరు కేంద్ర మంత్రులకు, కొతమంది సిట్టింగ్ ఎంపీలకు మొండి చేయి చూపించారు. అలాంటి వారిలో కేంద్ర మంత్రులు సుబ్బులక్ష్మి జగదీశన్, ఎస్.రఘుపతిలు ఉన్నారు.
అంతేకాకుండా, ఈ దఫా ఇద్దరు సినీ నటులకు లోక్సభకు పోటీ చేసే అవకాశం దక్కింది. మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు నెపోలియన్, వర్ధమాన నటుడు జేకె.రితీష్లకు పోటీ చేసే ఛాన్స్ దక్కింది. హెలెన్ డేవిడ్సన్, గాయత్రి శ్రీధరన్ వంటి మహిళలకు కూడా తొలిసారి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఎస్.ఆర్.జయదురై, ఆర్.ఎస్.భారతి, టీకేఎస్.ఇళంగోవన్, తామరై సెల్వన్లకు కూడా చోటు కల్పించారు. |