త్వరలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు తనను దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ యూనిట్లోని ఓ వర్గం బాగా ప్రయత్నించిందని జగదీష్ టైట్లర్ ఎన్డీటీవీతో చెప్పారు. సిక్కుల వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ జగదీష్ టైట్లర్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ ఇటీవల జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్లకు క్లీన్చిట్ ఇవ్వడంపై సిక్కు వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికి నిరసన తెలిపేందుకు రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి పి.చిదంబరంపై ఓ సిక్కు జర్నలిస్ట్ బూటు విసిరాడు.
ఈ సంఘటనను తనను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ నేతలు బాగా ఉపయోగించుకున్నారని టైట్లర్ చెప్పారు. తనను ఎన్నికలకు దూరంగా ఉంచేందుకు ఈ సంఘటన వారికి బాగా ఉపయోగపడిందన్నారు. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్నవారి మద్దతు అకాలీలు పొందారని ఆరోపించారు. ఇది అకాలీల పని మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి తానెవరి పేరు ప్రస్తావించాలనుకోవడం లేదన్నారు. |