వచ్చే ఎన్నికల్లో విచ్ఛిన్న శక్తులకు అవకాశం ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. విచ్ఛిన్న శక్తులు మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రాకుండా ఉండేందుకే తాము ఎన్సీపీ, ఆర్పీఐలతో జట్టు కట్టామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని సకోలిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్, పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్లతో కలిసి సోనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటు అనేది అధికార పోరాటం కాదని, అది సిద్ధాంతాల నడుమ పోరు అని పేర్కొన్నారు. అయితే సిద్ధాంతాల కోసం, దేశ సమైఖ్యత కోసం త్యాగాలు తప్పవని ఆమె తెలిపారు.
అలాగే దేశ నిర్మాణం రాత్రికి రాత్రే సాధ్యం కాదని అది నిరంతర ప్రక్రియ అని ఆమె పేర్కొన్నారు. విచ్ఛిన్నశక్తులు దేశాన్ని విభజించాలని చూస్తున్నాయని, అందుకోసం ఆ శక్తులు మతం, కులం, ప్రాంతీయతత్వాలని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నాయని ఆమె ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న ఆ తరహా విచ్ఛిన్నకర శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఆమె కోరారు.
మిగిలిన పార్టీలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీమాత్రమే తీవ్రవాదం, నిరుద్యోగం, దారిద్ర్యంపై పోరాడుతోందని పేర్కొన్న సోనియా గత ఐదేళ్లలో మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక విజయాలను సొంతం చేసుకుందని అన్నారు. |