సిక్కు అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్లకు తాము క్లీన్ చిట్ ఇవ్వలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సిక్కుల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తుందని ఆయన చెప్పారు. 1984 సిక్కుల ఊచకోతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగదీష్ టైట్లర్, సజ్జన్కుమార్లను ఎన్నికల బరిలోంచి తప్పించడం సమర్థనీయమేనని తెలిపారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, సాంకేతికంగా ప్రధాని ఆధ్వర్యంలో సీబీఐ పనిచేస్తుంది, వారి విషయంలో మేం జోక్యం చేసుకోం అని చెప్పారు.
క్లీన్చిట్ ఇచ్చేందుకు సీబీఐ నివేదికను మార్చారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రధాని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీపై విమర్శలతో పాటు ముస్లిం ఓటర్లను ఆకట్టుకుంనేందుకు ప్రయత్నించారు. వచ్చే ఎన్నికల్లో యూపీఏ కూటమి తిరిగి విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తీవ్రవాదంపై తాము మడమతిప్పని పోరాటం చేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ముంబై దాడులకు సంబంధించి అంతర్జాతీయ సమాజం ద్వారా పాక్పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చామని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదుల అడ్డాగా పాకిస్థాన్ మారిందని, ఇప్పటికైనా తీవ్రవాదులకు పాక్ అందిస్తున్న సాయాన్ని తక్షణం నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. |