నిరుడు జరిగిన ముంబై దాడుల్లో ప్రాణాలతో పట్టబడ్డ ఏకైక ఉగ్రవాది ముహమ్మద్ అజ్మల్ అమీర కసాబ్పై ఈ నెల 15న విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో అతని తరపున మాట్లాడేందుకు ఓ మహిళ అతనికి తల్లిగా సాక్ష్యమిచ్చేందుకు గత వారం ముంబై పోలీసు కార్యాలయంలోకి వచ్చింది. ఆమె కసాబ్ను కలవాలని పోలీసులను కోరింది.
40 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన ఓ మహిళ దక్షిణ ముంబైలోనున్న పోలీసు ప్రధాన కార్యాలయంలోని పౌర సహాయ కేంద్రంలోకి వచ్చినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆమె పోలీసు కార్యాలయంలోనికి వచ్చిన వెంటనే తాను కసాబ్ను కలవాలని కోరినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మహిళ మాట్లాడేతీరు చూస్తుంటే ఆమె పంజాబీలా ఉంది. ఆమె వస్త్రధారణ తీరు అలానే ఉందని ఆయన వివరించారు. తాను కసాబ్ తల్లినిగనుక ముందుగా జైలు అధికారిని కలవాలని ఆమె కోరినట్లు ఆయన తెలిపారు.
కసాబ్ చిన్నప్పుడు తన వద్దే ఉండేవాడని, కాని అతడు కనబడకుండా వెళ్లిపోయాడని ఆమె చెప్పింది. అంతగా అనుమానాలుంటే తనను డీఎన్ఏ పరీక్షలు చేసుకోమనికూడా ఆమె పోలీసులకు విన్నవించినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి.
ఇదిలావుండగా ఆమెను కసాబ్ను కలవనివ్వకుండానే బయటకు పంపేసినట్లు తెలిసింది. కాని ఆమె ఆనవాలు ఏవీ పోలీసులు తీసుకోలేదనేది సమాచారం. ఆమె మానసిక స్థితిపై తమకు అనుమానాలున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసు ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారి వీఎమ్ జాధవ్ ఈ విషయంపై స్పందిస్తూ ఓ మహిళ వచ్చి వెళ్ళిందని కాని ఎలాంటి అధికారిక వినతి పత్రాలు ఏవీ ఆమె వద్ద లేదని కాబట్టి అధికారికంగా తాము ప్రకటించలేదని ఆయన తెలిపారు.
ఒకవేళ ఆ మహిళనుంచి ఏదైనా వినతి పత్రం లభించివుంటే ముందుగా దానిపై విచారణ చేపట్టి ఉండేవారమని ఆయన పేర్కొన్నారు. |