గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీని ముసలమ్మ (వృద్ధురాలి)తో పోల్చినందుకు ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను మీకు ముసలమ్మలా కనిపిస్తున్నానా?' అని ఓటర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ తరపున శనివారం అమేథీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక ఖాలీద్పూర్ జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ తన అమ్మ సోనియా గాంధీ మీకు ముసలమ్మలా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు. రాహుల్ లేదా నేను కానీ మీకు ముసలివారిలా కనిపిస్తున్నామామా?' అని ప్రియాంక పదేపదే ప్రశ్నించారు. భాజపా నేత నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీని 125 సంవత్సరాల ముసలమ్మతో పోలుస్తూ ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్లో శుక్రవారం మరోసారి ఆయన అలా అనడం ప్రియాంకకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
'125 సంవత్సరాల ముసలమ్మలాంటి కాంగ్రెస్కు బదులు 30 సంవత్సరాల యువ భాజపాకు పట్టం కట్టేందుకు ఓటేయండి' అని మోడి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రియాంక మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టిందని, వాటిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రియాంక విజ్ఞప్తి చేశారు. |