భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీ అంటూ ప్రచారం చేసే కాంగ్రెసే.. అసలు సిసలు మతతత్వ పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్శౌరి ధ్వజమెత్తారు. దేశంలోని అందర్నీ సమానంగా చూడాల్సింది పోయి ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీయే మతతత్వ పార్టీగా ముద్రవేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో బీజేపీ మిత్రులు అనే పేరుతో మేధావులతో ఏర్పాటైన కార్యక్రమంలో అరుణ్శౌరి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు. అద్వానీ దేశానికి ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోందని, అయితే సోనియాగాంధీ, రాహుల్గాంధీలు దేశానికి ఏం చేశారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ఈ వేదిక నుంచి పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ తరహాలో ప్రస్తుతం బీజేపీ ఉందని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ విభజన ముందు ఉన్న ముస్లీంలీగ్ తరహాలో ఉందంటూ విమర్శించారు. |