ముంబై ఉగ్రవాద దాడుల కేసు విచారణలో ప్రధాని నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్ తరపున వాదించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయవాది అంజలీ వాఘ్మేరాను ఆ బాధ్యతల నుంచి ముంబై ప్రత్యేక కోర్టు బుధవారం తొలగించింది.
గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల్లో పాల్గొని భద్రతా దళాలకు పట్టుబడిన ఒకేఒక్క తీవ్రవాది కసబ్ తరపున వాదించేందుకు ప్రభుత్వం వాఘ్మేరాను నియమించిన సంగతి తెలిసిందే. అయితే కసబ్ లాయర్గా అంజలీ వాఘ్మేరా వ్యవహరించేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది.
ఇదే కేసులో మరోకరి తరపున వాదిస్తున్న సంగతిని కోర్టు దృష్టికి తీసుకెళ్లనందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. పటిష్ట భద్రత నడుమ బుధవారం ముంబయిలోని ఆర్థూర్ రోడ్డు జైలులో కసబ్, ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల విచారణ ప్రారంభమైన కాసేపటికే.. కోర్టు కసబ్ తరపు న్యాయవాది అంజలీ వాఘ్మేరాను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆమె ఈ కేసులో ఓ సాక్షి తరపున కూడా వాదిస్తున్న సంగతిని కోర్టు దృష్టికి తీసుకెళ్లలేదు. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే అంజలీ సహాయకుడు కేపీ పవార్ను కసబ్ తరపున వాదించేందుకు ప్రత్యేక కోర్టు అంగీకరించింది. |