గత ఏడాది ముంబై ఉగ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ తన తరపున వాదించేందుకు పాకిస్థాన్ చెందిన న్యాయవాదినే నియమించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ముంబై దాడుల కేసులో ఓ సాక్షి తరపున వాదిస్తున్న విషయాన్ని అంజలీ వాఘ్మేరా తమ దృష్టికి తీసుకురానందుకు ఆమె కసబ్ తరపున వాదించేందుకు కోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో తన తరపున వాదించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేయాల్సిందిగా పాకిస్థాన్ అధికారిక యంత్రాంగానికి విజ్ఞప్తి చేసేందుకు అనుమతించాలని కసబ్ కోర్టును కోరాడు. పాకిస్థాన్ ప్రభుత్వం న్యాయవాదిని ఏర్పాటు చేయకపోవచ్చని కోర్టు పేర్కొనగా, కసబ్ ఇంకొకసారి ప్రయత్నించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. కసబ్ కోరికపై పాక్ అధికారిక యంత్రాంగానికి ఈ విజ్ఞప్తిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. |