అస్వస్థత కారణంగా పాఠశాల పరిసరాల్లోనే విద్యార్ధిని మృతి చెందిన కారణంగా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలను రెండు రోజులపాటు మూసివేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్ధిని మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి తల్లితండ్రులు, ఇతర విద్యార్ధులు ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం, శనివారం పాఠశాలను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
న్యూఢిల్లీలోని వసంత్ విహార్లోని మాడ్రన్ స్కూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల ఆక్రితి భాటియా అనే 12వ తరగతి విద్యార్థిని గత సోమవారం అస్త్మాకు గురైంది. ఈ సమయంలో సదరు విద్యార్ధిని తన సమస్యను టీచర్ దృష్టికి తెచ్చింది. అయితే టీచర్ ఈ విషయంలో నిర్ల్యక్షం వహించింది. దీంతో ఆ విద్యార్ధిని ఆరోగ్యం విషమించింది.
ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం విద్యార్ధినిని ఆస్పత్రికి తరలించేసరికే ఆమె మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె తల్లితండ్రులు, ఇతరులు పాఠశాలపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా రెండు రోజులపాటు పాఠశాలను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. అదేసమయంలో విద్యార్థిని మృతిపై విచారించేందుకు ఓ బహిరంగ కమిటీ నియమించనున్నట్టు పాఠశాల యాజమాన్యం తెలిపింది. |