ముంబయిపై తీవ్రవాదుల దాడి సందర్భంగా ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ అమిర్ కసబ్ వయసును నిర్ధారించమంటూ పోలీసుల అధికారులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ముంబై దాడిలో పాల్గొన్న సమయంలో తాను మైనర్నని అందువల్ల తన కేసును బాల నేరస్థుల కోర్టులో విచారించాలని కసబ్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కోర్టు పై విధంగా ఆదేశించింది.
ఈ అంశానికి సంబంధించి ఈ నెల 28న జరగనున్న విచారణ సందర్భంగా కసబ్ వయసు నిర్థారణకు సంబంధించి డాక్టర్లను, జైలర్ను ప్రశ్నించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్కు న్యాయమూర్తి ఎమ్ఎల్ తహిల్యానీ అనుమతించారు. మరోవైపు కసబ్ వయసును నిర్ధారించేందుకు అతనికి వైద్య పరీక్షలు జరపాల్సిందిగా జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
కసబ్కు జరిపే వయసు నిర్ధారణ పరీక్షల రిపోర్టును ఏప్రిల్ 28కంటే ముందు తమకు సమర్పించాల్సిందిగా జైలు అధికారులను కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కసబ్కు వయసు నిర్థారించే పరీక్షలను జరపనున్నారు. |