పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ఐలా తుఫాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 45కు చేరుకుంది. వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు బెంగాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెల్సిందే.
కాగా, ఐలా తుఫాను ధాటికి లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. విద్యుత్, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి. కోల్కతా నగరంతోపాటు, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది.
భారీ వర్షాలకు కోల్కతా నగరం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. రైళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులతో పాటు విమాన సర్వీసులు సైతం పూర్తిగా నిలిపివేశారు.
ఇదిలావుండగా, ఐలా ధాటికి దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో 28 మంది మృతి చెందగా, కోల్కతా, హౌరాలో ఆరుగురు చొప్పున, బీర్భూమ్లో ముగ్గురు, బంకురా, మాల్డాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఐలాను ఊహించని ఉత్పాతంగా అభివర్ణించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలు చేపట్టేందుకు ముగ్గురు మంత్రుల్ని తుఫాను బాధిత జిల్లాలకు పంపారు. భారీ వర్షాల తాకిడికి 100కిపైగా కరకట్టలు కొట్టుకుపోయినట్లు చెప్పారు.
తుఫాను బారినపడకుండా తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఐలా ప్రభావంతో 20 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలకు తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
మమత ఢిల్లీ ప్రయాణం రద్దు తుఫాను ఉగ్రరూపం దాల్చడంతో కేంద్ర మంత్రి మమతాబెనర్జీ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. తుఫాను తీవ్రతపై ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు ప్రణబ్, ఆంటోనీలతో మాట్లాడారు. అవసరమైన సాయాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సహాయ, పునరావాస చర్యల్లో పోలీసులకు తోడుగా సైన్యం, బీఎస్ఎఫ్ పనిచేస్తాయని మమతా ప్రకటించారు. |