గురువారం నూతనంగా మన్మోహన్సింగ్ సర్కారులో మంత్రి పదవులను స్వీకరించిన 79 మంది మంత్రులలో 47 మంది కోటీశ్వరులు ఉన్నారు. 90 కోట్ల రూపాయల ఆస్తులతో ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అగ్ర స్థానాన్ని ఆక్రమించారు.
మరో విశేషమేమిటంటే మన్మోహన్ మంత్రి వర్గంలోని 47 మంది కోటీశ్వరులలో 38 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. అలాగే, డీఎంకేకు చెందిన ఐదుగురు, ఎన్సీపీకి చెందిన ఇద్దరు, జేకేఎన్ అండ్ ఏఐటీసీకి చెందిన ఒక మంత్రి కోటీశ్వరులుగా ఉన్నారు..
ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్ తన ఆస్తి విలువ గరిష్టంగా రూ.89.9 కోట్లుగా చూపించగా, పాటియాల ఎంపీ ప్రణీత్ కౌర్ ఆస్తి రూ.42.3 కోట్లుగా పేర్కొన్నారు. చాందినీ చౌక్ ఎంపీ కపిల్ సిబాల్ ఆస్తి విలువ రూ.31.9 కోట్లుగా చూపించారు. అలాగే, విన్సెంట్ పలా రూ.25.16 కోట్లుగాను, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ రూ.22.52 కోట్లుగాను పేర్కొన్నారు.
ఇక రైల్వేమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ అత్యంత తక్కువ ఆస్తులను కలిగి ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ. 4.73 లక్షలు మాత్రమే. మమతా బెనర్జీ కంటే కాస్తంత ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నవారిలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి శిశిర్ కుమార్ రూ. 11 లక్షలు, కేరళ ఎంపీ ఆంటోనీ రూ. 14.24 లక్షల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు.
మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారిలో ఇద్దరు మంత్రులు మాత్రం తమ ఆస్తి వివరాలను వెల్లడించలేదు. వీరిలో కాంగ్రెస్కు చెందిన హెచ్.పాలా, డీఎంకేకు చెందిన డి.నెపోలియన్లు ఉన్నట్టు నేషనల్ ఎలక్షన్ వాచ్ కమిటీ వెల్లడించింది |