మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునూతల గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్పై చేయిచేసుకున్న నాగర్కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివరణ కోరింది. ఈ సంఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ... మందాపై వచ్చిన ఆరోపణలపై తాము వివరణకోరామని ఆయన అన్నారు. వాస్తవాలు తెలుసుకొని ఆయనపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ తరుపున ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు గానీ, కాంగ్రెస్ వర్గీయుల నుంచి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. కాగా బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మందా జగన్నాథంపై పోలీసులు ఐపిసి 353, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న బ్యాంకు మేనేజర్పై చేయిచేసుకున్న ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్సీ, ఎస్టీలకు మంజూరైన రుణాలను విడుదల చేయకుండా గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ లోక్సభ సభ్యుడు మందా జగన్నాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు ఎందుకు విడుదల చేయడం లేదని తాను రవీందర్ రెడ్డిని ప్రశ్నించగా, ఆయన మద్యం సేవించిన మత్తులో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని ఎంపీ ఆరోపిస్తున్నారు. అయితే, తాను విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, బ్యాంకుకు సంబంధించిన ఇతర పనుల వత్తిడి కారణంగా రుణాలు విడుదలలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని మేనేజరు వివరణ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న రుణాలను త్వరలోనే విడుదల చేస్తానని చెప్పినా ఎంపీ పట్టించుకోకుండా తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. |