రెండోసారి రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ ఈ నెల 3న ప్రవేశపెట్టబోయే ప్రస్తుత యూపీఏ కూటమి ప్రభుత్వ తొలి రైల్వే బడ్జెట్లో ఛార్జీల పాక్షిక సవరణ, సరుకు రవాణాపై ప్రోత్సాహకాలు, భద్రతకు అదనపు నిధులు, చిన్నవ్యాపారులకు రూ.20లకే సీజన్ పాస్లు అందజేసే చర్యలు హైలెట్స్ కానున్నాయి.
అంతేకాకుండా తాజా రైల్వే బడ్జెట్లో స్టేషన్లలో ఎకనామిక్ మీల్స్, మరిన్ని జనతా రైళ్లు ప్రకటించే అవకాశం ఉంది. రాయ్బరేలీలో రైల్వే కోచ్ ప్యాక్టరీ పనులు, ప్రత్యేక సరకు రవాణా కారిడార్ (డీఎఫ్సీ)ను వేగవంతం చేసే చర్యలకు కూడా ఈ బడ్జెట్లో చోటు కల్పించనున్నారు.
ప్రపంచశ్రేణి రైల్వే స్టేషన్లపై ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా వేగిరం చేయనున్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్లోని సీల్డా స్టేషన్ను కూడా చేర్చే అవకాశముంది.
కాశ్మీర్ రైల్ లింక్ ప్రాజెక్టులో కత్రా, ఖజీగుండ్ మధ్య నిర్మాణ పనులు పునరుద్ధరించే దిశగా తాజా బడ్జెట్లో నిర్ణయాలు వెలువడనున్నాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ పనులు నిలిచిపోయి ఉన్నాయి. అలైన్మెంట్ సమస్యల కారణంగా కత్రా- ఖజీగుండ్ మధ్య పనులకు ఆటంకం ఏర్పడింది. |