జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని సమస్యాత్మక బారాముల్లా పట్టణం నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉపసంహరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణంలో గత కొన్నిరోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ వారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు యువకులు మృతి చెందారు.
యువకుల మృతిపై బారాముల్లా పట్టణంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నిరసనకారులు విధ్వంసానికి దిగారు. కర్ఫ్యూ విధించినప్పటికీ, నిరసనకారులు దానిని ఉల్లంఘించి ఆందోళన చేయడంతో, విధ్వంసక చర్యలకు పాల్పడటంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని భద్రతా దళాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఖాన్పోరా- బారాముల్లా వద్ద మంగళవారం సాయంత్రం సీఆర్పీఎఫ్ సిబ్బంది కాల్పుల్లో ఫయాజ్ అనే యువకుడు మృతి చెందడం స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఫయాజ్ మృతి సంబంధించి సీఆర్పీఎఫ్ జవానుపై హత్య కేసు నమోదయింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న జవానును బారాముల్లా పోలీసులకు అప్పగించాలని జమ్ము- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సీఆర్పీఎఫ్ అధికారిక యంత్రాంగాన్ని కోరింది. ఇదిలా ఉంటే స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పట్టణం నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరి స్థానంలో వెంటనే కాశ్మీర్ పోలీసులను మోహరించారు. |