పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జులై 27 వరకు జరుగుతాయి. తొలి రోజు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్థిక సర్వేలో భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని అంచనా వేయనున్నారు.
అంతేకాకుండా ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వ్యూహాలు, పెరుగుతున్న ఆర్థిక లోటును భర్తీ చేసే చర్యలను ఇందులో కేంద్రం ప్రస్తావించనుంది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి రేటు 6.7 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వరుసగా మూడేళ్లపాటు భారత ఆర్థిక వ్యవస్థ సగటున తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.
గత ఏడాది ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వణికించడంతో ఆ ప్రభావం దేశ ఆర్థికాభివృద్ధి రేటుపై కూడా పడింది. గత ఏడాది సెప్టెంబరులో అమెరికా ఆర్థిక దిగ్గజం లేమాన్ బ్రదర్స్ దివాలా తీసిన అనంతరం ఆర్థిక మాంద్యం కోరలు చాచింది. సెప్టెంబరు మధ్యలో భారత్తోసహా, మిగిలిన ప్రపంచదేశాలను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
దీంతో అక్టోబరులో దేశ ఎగుమతుల వృద్ధి రేటు తిరోగమనబాట పట్టింది. పారిశ్రామికోత్పత్తి కూడా గత ఆర్థిక సంవత్సరంలో పడిపోయింది. ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తదనంతరం మూడు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. ఈ ఉద్దీపన ప్యాకేజీల కారణంగా ఆర్థిక లోటు ఆరు శాతానికిపైకి చేరింది.
జీడీపీలో ఆర్థికలోటు అంతకుముందు వేసిన అంచనాల ప్రకారం 2.5 శాతం వద్ద ఉండగా, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల కారణంగా అది అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక లోటును తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను తగ్గించే చర్యలు కూడా ఆర్థిక సర్వేలో వెల్లడించే అవకాశముంది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3న రైల్వే బడ్జెట్, 6న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. |