బాబ్రీ మసీదు విధ్వంసంపై జస్టీస్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నివేదికలోని అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.
దేశ చరిత్రలోనే బాబ్రీ మసీదు కూల్చివేత అతిపెద్ద నేరంగా ఆయన వర్ణించారు. ఈ విధ్వంస కాండపై దర్యాప్తు జరిపిన కమిషన్ తుది నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్కు అందజేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అసలు విషయాలు ప్రజలకు తెలిపేందుకు గాను నివేదికను బహిర్గతం చేయాలని ఆయన కోరారు. ఇది కేంద్ర ప్రభుత్వ నైతిక బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.
నివేదికను అధ్యయనం చేస్తున్నట్టు కాంగ్రెస్ చెప్పడం పట్ల లాలూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికను బహిర్గతం చేసేందుకు వారు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సెక్యులర్ రాజకీయాల్లో బాబ్రీ మసీదును సంఘ్ పరివార్ శక్తులు ధ్వంసం చేయడం అతిపెద్ద నేరంగా పేర్కొన్న లాలూ, నివేదికలో దోషులుగా పేర్కొన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. |