ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం చట్టబద్ధమైనదేనని గురువారం తీర్పునిచ్చింది. అయితే దీనిపై ప్రధాన రాజకీయపక్షాలు మాత్రం నోరు విప్పడం లేదు. ఆర్జేడీ నేత... లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం తీవ్రంగా స్పందించారు.
హైకోర్టు నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని ఆయన అభివర్ణించారు. స్వలింగ సంపర్కం నేరంకాదని కోర్టు చెప్పిన నిర్ణయాన్ని తను వ్యతిరేకిస్తున్నాననీ, ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాననీ ప్రకటించారు.
భారతదేశంలో స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత ఎట్టి పరిస్థితుల్లో కల్పించకూడదనీ, ఇటువంటివాటిని మన సమాజం సుతారము అంగీకరించదని లాలూ అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కం అనే ప్రక్రియ అత్యంత జుగుప్సాకరమైనదన్నారు.
మరోవైపు జనతాదల్-యు అధ్యక్షుడు శరద్ యాదవ్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. స్వలింగ సంపర్కం అనేది దేశానికి పెద్ద సమస్య కాబోదన్నారు.
ఇదిలావుండగా గే సెక్స్కి చట్టబద్ధత కల్పించడంపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం, న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ అజాద్ సమావేశమై పరిస్థితిపై చర్చించారు.
స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత.. తదుపరి దేశంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలన్నింటినీ చేర్చి ప్రధానికి నివేదిక రూపంలో అందజేయనున్నట్లు మొయిలీ తెలిపారు. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలలో సీపీఐ-ఎమ్ మాత్రమే కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్, భాజపాలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి. |