గత యూపీఏ ప్రభుత్వ పాలనా కాలంలోని రైల్వేల పని తీరుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ లోక్సభలో విరుచుకుపడింది. గతంలో రైల్వే లెక్కల్లో మాజీ రైల్వేశాఖామంత్రి లాలూ లెక్కల్లో గోల్మాల్ చేసారని బీజేపీ మండిపడింది.
గతంలో రైల్వేల ఆర్ధిక పరిస్థితి దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్లు రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎలుగెత్తి చాటారు. అదే ఊపులో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆయన మేనేజ్మెంట్ పాఠాలు చెప్పిన విషయం విదితమే.
అయితే అవాస్తవికమైన, మితి మీరిన లక్ష్యాలను రైల్వేలు ఏర్పాటు చేసుకున్నట్లు, రైల్వేల పనితీరును అసాంతం మార్చవలసిన అవసరమున్నట్లు రైల్వే బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుత రైల్వేశాఖామంత్రి మమతా బెనర్జీ ప్రటించారు.
దీంతో రైల్వేల పనితీరుపై లోక్సభలో విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా రైల్వే శాఖ విత్త కొరతను ఎదుర్కొంటున్నట్లు కూడా మమత ప్రకటించారు.
ఇప్పటిదాకా రైల్వేలకు బ్రహ్మాండమైన లాభాలు వచ్చాయని, దాంతో అదనపు ఆర్థిక నిల్వలున్నాయని వెల్లడించిన గత రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నివేదికలపై పలు అనుమానాలు తలెత్తుతున్నట్లు బీజేపీ పేర్కొంది.
సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు ఆ సంస్థ లెక్కల్ని తారుమారు చేసి పద్దుల కుంభకోణానికి పాల్పడినట్లుగానే దాణా కుంభకోణ నిందితుడు లాలూ కూడా రైల్వే లెక్కలను అతిగా చిత్రీకరించి, సరికొత్త పద్దుల కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నాయకుడు అనంతకుమార్ లోక్సభలో విమర్శించారు.
అదే విధంగా రైల్వే భూములను అభివృద్ది పరచే సాకుతో వాటిని ప్రైవేట్ వ్యక్తులకు లాలూ ధారాదత్తం చేశారని కూడా ఆయన విమర్శించారు. |