కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన సలహా సంఘంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్కు చోటు కల్పించారు. అలాగే, వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్, పెప్సికో సీఈఓ ఇంద్రనూయీతో పాటు.. మరికొంత మంది మేధావులు ఉన్నారు.
అంతర్జాతీయ సలహా సంఘం (గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్)గా వ్యవహించే ఈ సలహా మండలి దేశానికి, విదేశాల్లో ఉన్న భారతీయ మేధావులకు మధ్య వారధిగా, సమన్వయకర్తగా పని చేస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ప్రతిభావంతులైన ప్రవాస భారతీయుల సేవలను వినియోగించుకోవడంలో ప్రధానికి సలహాలిస్తుంది.
ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వాయలార్ రవి బుధవారం తెలిపారు. మొత్తం 23 మంది సభ్యులు ఉండే ఈ కమిటీలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎంకృష్ణ, సిటీ గ్రూపు సీఈఓ విక్రమ్ పండిట్, ప్రవాస భారతీయ వ్యాపారదిగ్గజం కరణ్ బిలిమోరియా, విద్యావేత్త శ్యామ్ పిట్రోడా తదితరులు ఉన్నారు. |