స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై సుప్రీం కోర్టు గురువారం విచారించే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన సురేష్ కుమార్ కుషాల్ అనే జ్యోతిష్కుడు ఈ పిటీషన్ను దాఖలు చేశారు.
ఈనెల రెండో తేదీన ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత సబబేనంటూ తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. స్వలింగ సంపర్కాన్ని భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 నేరంగా ప్రస్తుతం పేర్కొంటున్నారు. ఈ సెక్షన్పై కొంతకాలం నుంచి స్వలింగ సంపర్కాన్ని సమర్థిస్తున్న వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది.
దీనిపై దుమారం చెలరేగుతుండటంతో ఈ చట్టం రద్దుకు కేంద్రం కూడా సానుకూల వైఖరితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, మరో న్యాయమూర్తి ఎస్ మురళీధర్తో కూడిన ధర్మాసనం స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధత కల్పిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
స్వలింగ సంపర్కుల "రైట్ టు ఈక్వాలిటీ"ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అయితే రాజ్యంగంలోని ఐపీసీ 377వ సెక్షన్ స్వలింగ సంపర్కాన్ని అసహజ శృంగార చర్యగా పేర్కొంటూ, దీనికి గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించే అవకాశం కల్పించింది. దేశంలో స్వలింగ సంపర్కం రాజ్యాంగం ప్రకారం నిషిద్ధం.
ఈ పరిస్థితుల్లో ఆస్ట్రాలజర్ ఢిల్లీ హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్వలింగ సంపర్కాన్ని ఏ ఒక్కరు అంగీకరించరు. ముఖ్యంగా.. పశువులు సైతం ఇలాంటి చర్యకు పాల్పడవని ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశంలో ఎయిడ్స్ వ్యాధి ప్రబలే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. |