దేశవ్యాప్తంగా ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి మృతి చెందినవారి సంఖ్య ఆదివారం 28కి చేరుకుంది. తాజాగా బెంగళూరులో ఇద్దరు, పూణే ఒకరు స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయారు. చివరి ముగ్గురు మహిళలే కావడం గమనార్హం.
బెంగళూరులో 27 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు ప్రమాదకర హెచ్1ఎన్1 వైరస్ సోకి మృతి చెందగా, పూణేలో 36 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. బెంగళూరులో ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ కారణంగా ఐదు మరణాలు సంభవించాయి.
బెంగళూరులో మృతులందరూ వ్యాధి నిర్ధారణ కాకముందే ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పూణే తరువాత బెంగళూరులో ఎక్కువ స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించాయి.
పూణేలో మొత్తం 13 మంది స్వైన్ ఫ్లూతో మృతి చెందారు. పూణే, బెంగుళూరు నగరాలు కాకుండా, అహ్మదాబాద్, నాసిక్, చెన్నై, తిరువనంతపురం, రాయ్పూర్, బిలాపూర్లలో ఒక్కొక్కరిని స్వైన్ ఫ్లూ బలితీసుకుంది. ముంబయి (2), వడోదరా (2) నగరాల్లో మిగిలిన మరణాలు సంభవించాయి.