ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీని అంతర్గత కుమ్ములాటలు పట్టిపీడిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఓటమిని, రానున్న రాష్ట్ర శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అద్వానీ సెప్టెంబర్లో యాత్ర తలపెట్టారు. అయితే, ఇటీవలి కాలంలో ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీ శ్రేణులను కుంగదీశాయి.
ఇలాంటి పరిస్థితుల్లో యాత్రను నిర్వహించడం మంచిది కాదని సన్నిహితులు సూచించారు. ఫలితంగా.. అద్వానీ తన యాత్రను వాయిదా వేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్లో మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు నుంచి ఈ యాత్ర సాగుతుందని అనుకున్నామని, అయితే ఇప్పుడది వాయిదా పడినట్లు పార్టీ నాయకులంటున్నారు.
గత లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను కార్యకర్తలకు వివరిస్తానని అద్వానీ జూన్లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. తమ ముందున్న అవకాశాలను, సవాళ్లను పార్టీ కార్యకర్తలకు తన యాత్ర ద్వారా అగ్రనేత వివరిస్తానని ఆ పార్టీ సీనియర్లు తొలుత ప్రకటించారు.
అంతేకాకుండా.. పార్టీ శ్రేణులతో ఆయన స్వయంగా ముచ్చటిస్తూ.. యాత్రను నిర్వహించాలని భావించారు. పార్టీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ బహిష్కరణ వ్యవహారం, అరుణ్శౌరీ, ఖండూరీల తిరుగుబాటు, వసుంధర రాజే సింధియా వ్యతిరేకత తన యాత్రపై పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితిని అద్వానీకి కల్పించినట్లు చెబుతున్నారు.