భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం ఆ పార్టీ ప్రక్షాళనకు దారితీసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలను యువతరానికి అప్పగించాలని మాతృసంస్థ ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న వాదననకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరింత బలం చేకూర్చుతున్నాయి.
కాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పదవీ కాలం వచ్చే డిసెంబరుతో ముగియనుంది. ఆ తర్వాత ఆ బాధ్యతలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించాలని ఆర్.ఎస్.ఎస్ నేతలు కోరుతున్నారు. ఇదే విషయంపై పక్కా హిందుత్వవాది నరేంద్ర మోడీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరినట్టు సమాచారం.
అదేసమయంలో ఛాందసవాది మోడీ జాతీయ స్థాయిలో రాజకీయంగా కీలక పాత్ర పోషించాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పట్టుదలగా ఉన్నారని నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో వినికిడి. అయితే, తన నిరంకుశ వ్యవహార సరళిని మోడి సవరించుకోవలసి ఉంటుందని భగవత్ షరతు విధించినట్టు లోగుట్టు.
ఆయన వ్యవహార సరళి ఆర్ఎస్ఎస్ పంథాకు అనుగుణంగా లేదని భగవత్ భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండాలని కూడా మోడీకి స్పష్టం చేశారు అని ఆర్ఎస్ఎస్ సీనియర్ పరిశీలకుడు దిలీప్ దేవధర్ తెలియజేశారు. మోడీ తన పంథాను మార్చుకుంటే... వచ్చే 2014 పార్లమెంటరీ ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరగగలవని ఆయనకు సూచించినట్లు ఆర్ఎస్ఎస్ పరిశీలకులు తెలిపారు.
గుజరాత్ రూపురేఖలు మార్చివేసిన రాజకీయ నేతగా మోడీకి పేరున్నప్పటికీ.. పార్టీ ఎమ్మెల్యేలకు, కేడర్కు ఏమాత్రం అందుబాటులో ఉండబోరన్నది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులకు ఆయన ఎప్పుడూ సమయం కేటాయిస్తుంటారని చెబుతుంటారు. మొత్తం మీద భాజపా సారథ్య బాధ్యతలను నరేంద్ర మోడీ చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.