బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్లు పార్టీలో తమ పాత్ర ఎలా ఉండాలో వారే నిర్ణయించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. పార్టీలో తాము నిర్వహిస్తున్న పదవులను ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్లు విడిచిపెట్టనున్నట్లు వచ్చిన వార్తలకు బలం చేకూర్చేలా మోహన్ భగవత్ పైవ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మోహన్ భగవత్ సోమవారం మాట్లాడుతూ.. పార్టీలో తమ పాత్రలేమిటో అద్వానీ, రాజ్నాథ్ సింగ్లే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇతర నేతలు కూడా పార్టీలో ఎటువంటి పాత్ర పోషించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోవలన్నారు. బీజేపీ భవిష్యత్ బాగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అద్వానీ వంటి నైతిక బాధ్యత వహించే నేతలు పార్టీలో ఉన్నారు.
వారి నేతృత్వంతో అన్ని సమస్యలను వారే పరిష్కరించుకుంటారని తెలిపారు. దీనిపై తాము చేయాల్సిందేమీ లేదన్నారు. తామేం చెప్పాలో ఇది ఇప్పటికే చెప్పాము. ఇదిలా ఉంటే ముందురోజు రాజ్నాథ్ సింగ్ అధ్యక్ష బాధ్యతల్లో డిసెంబరు తరువాత కొనసాగబోరని పార్టీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. డిసెంబరుతో రాజ్నాథ్ సింగ్ మూడేళ్ల పదవీ కాలం తీరిపోనుంది.
ఆ తరువాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని, రాజ్నాథ్ సింగ్ అధ్యక్ష పదవి పొడిగించబడదని తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా తప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పుకోవాలనే నిర్ణయం అద్వానీకే వదిలిపెట్టినట్లు సమాచారం.