అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి త్వరలో శుభం కార్డు పడుతుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చివరి దశకు వచ్చిందన్నారు. రాబోయే నెలల్లో తిరిగి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుందని ప్రధాని తెలిపారు.
ప్రణాళిక సంఘంతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ప్రధాని పైవ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ముందురోజు స్థూల జాతీయోత్పత్తి తొలి త్రైమాసికంలో 6.1 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 5.8 శాతం వద్దే ఉంది.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, నిరాశాజనకంగా ఉన్న రుతుపవనాల వలన దేశం ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల చూస్తోందన్నారు. ఇబ్బందికర ఏడాది గుండా వెళుతున్నాము. రాబోయే నెలల్లో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకోవడం చూస్తాము. అంతేకాకుండా ఈ ఏడాది రుతుపవనాల ప్రదర్శన కూడా నిరాశాజనకంగా ఉందని ప్రధాని చెప్పారు.