పూణేలో స్వైన్ ఫ్లూతో మంగళవారం ఏడేళ్ల బాలిక మృతి చెందింది. పూణే నగరంలో దేశంలోనే అత్యధిక సంఖ్యలో స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. తాజా మృతితో నగరంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 32కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర వైరస్ ఇప్పటివరకు బలితీసుకున్న ప్రాణాల సంఖ్య 108కి పెరిగింది.
ప్రియాంకా షిమిల్కార్ అనే ఏడేళ్ల బాలిక ప్రభుత్వం నడుపుతున్న ససూన్ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూకి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ బాలికను ఆగస్టు 29న ఆస్పత్రిలో చేర్చారు. ఈ బాలికకు స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది.
ఇదిలా ఉంటే నగరంలో సెప్టెంబరు 3న జరిగే గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా వ్యాధి మరింత మందికి వ్యాపించే అవకాశం ఉండటంతో జిల్లా అధికారిక యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి గణేష్ మండళ్లతో జిల్లా అధికారిక యంత్రాంగం చర్చలు జరుపుతోంది. గణేష్ నిమజ్జనం, ఉరేగింపు కార్యక్రమాలను 12 గంటలకు మించకుండా చూడాలని భావిస్తున్నారు.