మహారాష్ట్ర అసెంబ్లీ సమరం కోసం అధికార కాంగ్రెస్, ఎన్.సి.పిల మధ్య పొత్తు ఖరారైంది. ఈ రెండు పార్టీలో పోటీ చేసే సీట్ల సంఖ్యపై కూడా ఓ అవగాహనకు వచ్చారు. సీట్ల ఒప్పందంపై మంగళవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇదిలావుండగా, మొత్తం 280 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 174 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపనుంది. అయితే, నాలుగైదు సీట్లలో మాత్రం మిత్రపక్షం ఎన్.సి.పితో రాజీ ధోరణి అవలంభించే అవకాశాలు లేకపోలేదు.
దీనిపై ఆ రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏకే.ఆంటోనీ, పీసీసీ చీఫ్ మాణిక్య రావు థాక్రేలు మీడియాతో మాట్లాడుతూ.. దాదాపుగా పొత్తుల విషయం ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. నాలుగైదు స్థానాలు మినహా ఏఐసీసీ భావిస్తున్న అన్ని సీట్లలోనూ అభ్యర్థులను పోటీకి దింపుతున్నట్టు వారు తెలిపారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్లు సోమవారం సమావేశమై.. 140 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. వీరిలో ముఖ్యమంత్రి అశోక్చవాన్తో పాటు మరికొంతమంది మంత్రులు, సీనియర్ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ కురువృద్ధుల వారసులకు టిక్కెట్లు కేటాయించే విషయంలో అధినేత్రి వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు.