తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో జనని (సాంఘిక సాంస్కృతిక సమితి) ఆధ్వర్యంలో విశ్వకవి గుఱ్ఱం జాషువా 114వ జయంతి వేడుకలను స్థానిక పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సమితి వ్యవస్థాపకులు గుడిమెట్ల చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతి మహిళా కళాశాల తెలుగు శాఖ విశ్రాంతాచార్యులు డాక్టర్. నిర్మలా పళని వేలు ప్రసంగిస్తూ... మహాకవులకు, జయంతులు, వేడుకలుండవని, వారు చిరంజీవులని కొనియాడారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ వారి రచనల ద్వారా కవులు చిరకాలం జీవించే ఉంటారని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆస్కా కోశాధికారి జీ.కే. రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీజీ ప్రాచ్య కళాశాల తెలుగు ఉపన్యాసకులు కాకాని సుధాకర్, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఉపాధ్యాయులు డాక్టర్ విస్తాలి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.