రాహుల్ గాంధీ గ్రామాల సందర్శనలో తప్పేముంది: ఆర్ఎస్ఎస్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ దేశంలోని గ్రామగ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకోవడం చాలా మెచ్చుకోదగ్గ విషయమని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది. దేశంలో 67 శాతం ప్రజలు గ్రామాలలోనే నివశిస్తున్నారు కనుక వారి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
రాహుల్ గాంధీ పల్లెబాట పట్టి అక్కడి ప్రజల జీవనం ఎలా ఉందో తెలుసుకుంటున్నందుకు ఆయనను అభినందిస్తున్నామని ఆర్ఎస్ఎస్ తెలిపింది. గ్రామ ప్రజల అవసరాలకు తగినట్లుగా పాలనా కార్యకలాపాలను రూపొందించుకోవాలంటే గ్రామ సందర్శన తప్పనిసరి అని అభిప్రాయపడింది.
ఉత్తరప్రదేశ్లోని దళితవాడలలోని ప్రజలను రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడాన్ని భాజపా అదంతా "ఫార్స్"అని అభివర్ణించడాన్ని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది. గ్రామాలు అభివృద్ధి సాధించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని, ఉపాధికోసం గ్రామ ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస రావడాన్ని నిరోధించాలంటే గ్రామాల అభివృద్ధి తప్పనిసరని అభిప్రాయపడింది.