ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » "రాజధాని" ప్రయాణికులు సురక్షితం: చిదంబరం (Home Minister | P Chidambaram | Rajdhani Express | passengers | Drivers | Kidnapped | Mamata Benarjee)
మావోయిస్టులు తమ అధీనంలోకి తీసుకున్న రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని హోం మంత్రి పి. చిదంబరం వెల్లడించారు. సీఆర్పీఎఫ్ దళాలతోపాటు రాష్ట్ర పోలీసులు సంఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారన్నారు. సంఘటనా స్థలంలో హింసాత్మక చర్యలు చోటుచేసుకుంటున్నట్లు ఎటువంటి సమాచారం లేదన్నారు.
సంఘటనా స్థలంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎటువంటి కాల్పులు జరగలేదని ఆయన పేర్కొన్నారు. అయితే రైలు డ్రైవరుపై జరిపిన కాల్పుల్లో అతనికి గాయాలయ్యాయనీ, సీఆర్పీఎఫ్ దళ సభ్యులకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.
ప్రయాణికులను తిరిగి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఒరిస్సాకు యుద్ధప్రాతిపదికన రిలీఫ్ ట్రెయిన్ను పంపించినట్లు తెలియజేశారు. రైల్వేమంత్రి మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చిదంబరం... మీడియా ఓ వార్తను రాసే ముందు కాస్త సంయమనాన్ని పాటించి నిర్థారణ చేసుకున్న అనంతరం రాయాలని సూచించారు.
ఇదిలా వుండగా.. జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలును అడ్డగించి రైలు డ్రైవర్లను కిడ్నాపు చేయడం ద్వారా మావోలు మరోసారి తమ సత్తాను చాటుకున్నారు. తమ నేత ఛత్రధర్ మహతోను భేషరతుగా విడుదల చేయాల్సిందిగా కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీని డిమాండ్ చేశారు.
అయితే చర్చలు జరపాలంటే ప్రయాణికులను సురక్షితంగా విడిచిపెట్టాలని మంత్రి కోరారు. రైల్వే శాఖకు సంబంధించినంత వరకూ తాను చర్చలు జరపడానికి సిద్ధమేననీ, అయితే మావోలు రైలు డ్రైవర్లను విడుదల చేస్తేనే అది సాధ్యమవుతుందని వెల్లడించారు. ఎవరైనా... తమకు ఎదురవుతున్న సమస్యను తనతో చర్చించాలనుకుంటే.. భేషరతుగా తనతోమాట్లాడవచ్చని మమతా బెనర్జీ అన్నారు.