భారతీయ జనతా పార్టీకి కాన్సర్ వ్యాధి సోకిందని అందువల్ల ఆ పార్టీకి సర్జరీ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీప్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి చికిత్స అవసరమో కాదో కమలనాథులే తేల్చుకోవాలని ఆయన సూచించారు.
జైపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భాజపా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనివల్ల పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహం తగ్గింది. ప్రధానంగా భాజపా కాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దానికి ఆపరేషన్ లేదా కీమోథెరపీలలో ఏది అవసరమో వారే తేల్చుకోవాలన్నారు.
ఇకపోతే.. దేశంలో కులమతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలన్నది తన అభిమతమన్నారు. భాజపా బహిష్కృత నేత జశ్వంత్ సింగ్పై ప్రశ్నించగా, ఆయన జిన్నాపై రాసిన పుస్తకం చదవడం ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా జిన్నాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు రాదన్నారు.
అందువల్ల దీనిపై మళ్లీ మళ్లీ మాట్లాడాల్సిన అవసరం లేదని భాగవత్ తేల్చి చెప్పారు. ఇదిలావుండగా, భాగవత్ వ్యాఖ్యలపై భాజపా తక్షణం స్పందించింది. తమకు ఎలాంటి చికిత్స చేయాలో డాక్టరుకు మాత్రమే తెలుస్తుందని, తాము రోగులం మాత్రమే అని చమత్కరించారు.