దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మావోయిస్టుల దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొడతామని ప్రధాని మన్నోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ద్విముఖ వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కివక్కాణించారు.
ఆయన గురువారం శ్రీనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు అభివృద్ధి కుంటుపడకుండా చూడాల్సి ఉందని గుర్తు చేశారు. ఏ తరహా సామాజిక, ఆర్థిక అభివృద్ధికైనా సమాజంలో శాంతి భద్రతలు నెలకొనడం కీలకమన్నారు. అయితే, ఈ శాంతికి మావోలు విఘాతం కలిగిస్తున్నారని వాపోయారు.
మావోలు అపహరించిన పోలీసు అధికారి విడుదలకు అరెస్టు చేసిన నక్సలైట్లను బెయిలుపై విడుదల చేయాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఒక్క బెంగాల్లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో మావోయిస్టుల బెడద ఉందన్నారు. ఈ ముప్పును సమర్థవంతంగా తిప్పికొడతామని ప్రధాని తేల్చి చెప్పారు.