జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్లో భాగంగా లష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని అంతమొందించారు.
ఆదివారం ఉదయం రియాసీలోని మహోర్ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో లష్కర్-ఏ-తొయిబాకు చెందిన తీవ్రవాదిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
తాము జరిపిన ఆపరేషన్లో ఉగ్రవాది అబుతాలా మృతి చెందాడని, ఇతను లష్కర్ తీవ్రవాద సంస్థకు చెందిన వాడని, ఘటనా స్థలంలో ఏకే రైఫిల్తోపాటు మందుగుండు సామగ్రి, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలావుండగా ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.