దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నక్సల్స్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఆపరేషన్ నక్సల్స్ పేరుతో ఈ ఏరివేత కార్యక్రమం సాగనుంది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ సాగిస్తారు. ఇందుకోసం 40 వేల సాయుధ బలగాలను వినియోగించనున్నారు. ట్రై జంక్షన్ల పేరుతో పిలిచే మూడు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు సన్నద్దమయ్యారు.
ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్-ఒరిస్సా, జార్ఖండ్-పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో నక్సలైట్లు హింసకు పాల్పడుతున్నారు. వీరి ఆటకట్టించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం చేపట్టిన ఆపరేషన్లో సుమారు 40 వేల పారామిలటరీ బలగాలు ఆయా రాష్ట్రాల పోలీసులకు సహకరిస్తాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
దట్టమైన అడవుల్లో పోరాడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏడు వేల మందితో కూడిన ప్రత్యేక బృందం కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటుందని శాఖ వెల్లడించింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపట్టాలన్న కొత్త ప్రణాళికకు దేశ అంతర్గత రక్షణపై ఏర్పడిన కేబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఆయా ప్రాంతాల నుంచి మావోయిస్టులను ఏరివేశాక ఆయా ప్రాంతాల అభివృద్ధి పనుల కోసం రూ.7,300 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీనీ ప్రభుత్వం ప్రకటించనుంది.
దేశంలో ప్రస్తుతం 40 వేల చదరపు కిలోమీటర్ల మేరకు నక్సలైట్ల ప్రభావముందని, ఆపరేషన్లో భాగంగా సుమారు 12-30 నెలల కాలంలో వారిని ఏరిపారేస్తామని అధికారులు భావిస్తున్నారు. అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 25 లక్షల మంది గిరిజన, కొండజాతి ప్రజలు నివసిస్తున్నారు. వీరికి జీవినానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఈ ఆపరేషన్ సాగించాలని కేంద్రం భావిస్తోంది.