మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం రాత్రి విస్తరించారు. రాష్ట్ర హోం మంత్రిశాఖ బాధ్యలను ఉమశంకర్ గుప్తాకు అప్పగించారు. ఈయన దక్షిణ భోపాల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ విధులను నిర్వహిస్తూ వచ్చిన జగ్దీష్ దేవ్దాను రవాణా, జైళ్ళ శాఖ మంత్రిగా కొనసాగనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న గుప్తాకు శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయినప్పటికీ ఆయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మిన్నకుండి పోయారు. కాగా, కొత్తగా విస్తరించిన మంత్రివర్గంలో ఆరుగురి శాఖల్లో మాత్రం మార్పులు చేర్పులు చేయలేదు.
వీరిలో పట్టణాభివృద్ధి శాఖామంత్రి బాబూలాల్ గౌర్, ఆర్థిక మంత్రి రాఘవ్జీ, గృహ, పర్యావరణ శాఖామంత్రి జయంత్ మల్యా, ప్రజా, ఆరోగ్య శాఖామంత్రి గౌరి శంకర్ బిసేన్, ప్రజా పనుల శాఖామంత్రి నాగేంద్ర సింగ్, క్రీడలు, పర్యాటక శాఖామంత్రి తుకోజీరావు పవార్లు ఉన్నారు.