ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పే: రాజ్నాథ్ సింగ్ (Karnataka | CM | Yeddyurappa | Rajnath Singh | MLA's | Gali Brothers | BJP)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను మార్చే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తెగేసి చెప్పారు. దీంతో కన్నడ రాష్ట్రంలో అసమ్మతి సెగలు మరింత వేడెక్కాయి. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు, ఎంపిలతో చర్చలు కొనసాగుతాయని వెల్లడించారు. పార్టీలో నెలకొన్న పరిస్థితిని పరిష్కరించాలని, ఎవరినీ నొప్పించ కూడదనే నిర్ణయంలో తాము ఉన్నట్టు తెలిపారు.
కర్ణాటక సంక్షోభంపై ఆయన పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, ప్రధాన కార్యదర్శులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో కలిసి రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో నెలకొన్న అసమ్మతి పరిష్కారమౌతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అంశంపై తమకు పూర్తి నమ్మకం ఉంది. కర్నాటకలో నెలకొన్న అన్ని అంశాలూ త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని జోస్యం చెప్పారు.
ఇదిలావుండగా, కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారకులైన గాలి జనార్ధన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలు అధిష్టానంతో జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరిగి తీరాల్సిందేనని గాలి బ్రదర్స్ తేల్చి చెప్పారు. ఇలాంటి తరుణంలో యడ్యూరప్పను ఎట్టిపరిస్థితిలోనూ మార్చే ప్రసక్తి లేదని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో కర్ణాటక అసమ్మతి సెగలు మరింత వేడెక్కే ప్రమాదం ఉంది.