దక్షిణ భారతదేశంలోని కలనాథులకు పట్టం కట్టిన కన్నడ వాసులకు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యవహిస్తున్న తీరు ఏమాత్రం మింగుడు పడటం లేదు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆ రాష్ట్ర మంత్రులు గాలి బ్రదర్స్కు ముఖ్యమంత్రి యడ్యూరప్ప అడ్డు తగలడమే అన్ని సమస్యలకు మూలకారణంగా తెలుస్తోంది.
అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అనే సామెతను రుజువు చేస్తూ యడ్యూరప్ప పాలన సాగిస్తున్నది అసమ్మతివాదుల ప్రధాన ఆరోపపణ. దీంతో ఉత్తర కర్ణాటకను శాసిస్తున్న గనుల పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర మంత్రులు అయిన గాలి కరుణాకర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డిలు తిరుగుబాటు బాటు బావుటా ఎగురవేశారు. ఏకంగా ముఖ్యమంత్రిని మార్చాలని, లేని పక్షంలో ప్రభుత్వం కూల్చి వేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వ కొలువు గాలిలో దీపంలా మారింది.
ఈ నేపథ్యంలో... భాజపా అధిష్టానం ముఖ్యమంత్రికి అండగా నిలబడింది. దీన్ని సహించలేని గాలి బ్రదర్స్ తమ అసమ్మతిని మరింత ముమ్మరం చేసి, ఏకంగా ఢిల్లీలో తిష్టవేసి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో అధిష్టానం దిగి వచ్చింది. యడ్యూరప్పను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గాలి బ్రదర్స్ ఒత్తిడికి తలొగ్గిన కమలనాథులు యడ్యూరప్పను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఆయన స్థానంలో స్పీకర్ జగదీశ్ షెట్టర్ను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈయనకు గాలి బ్రదర్స్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా తమ మాట ప్రకారం నడుచుకుంటే కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఐదేళ్ళ పాటు పూర్తి మనుగడ సాగిస్తుందని గాలి సోదరులు అధిష్టానానికి తెగేసి చెప్పడం గమనార్హం.