ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పెరుగుతున్న జనాభా: తగ్గుతున్న ఆహార ఉత్పత్తి! (Population | Food Products | GDP | Food Security | Sarad Pawar)
దేశంలో ఆహార ఉత్పత్తుల కొరత భవిష్యత్లో తలెత్తనుందా.? తలెత్తనుందనే అంటున్నారు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ యాదవ్. గత 1950 నుంచి 2008 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ)లో వ్యవసాయం వాటా 51 శాతం నుంచి కేవలం 18 శాతానికి పడిపోయిందని ఆయన చెప్పారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగిన పక్షంలో ఆహార వస్తు ఉత్పత్తుల కొరత తప్పదని ఆయన చెప్పారు. అందువల్ల ఆహార భద్రత దేశానికి ఆందోళనకరంగా మారిందని ఆయన చెప్పారు.
శుక్రవారం తమిళనాడులోని కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి శరద్ పవార్ పాల్గొని ప్రసంగించారు. 1972-2007 మధ్య కాలంలో దేశ జనాభా 55.1 కోట్లు నుంచి 112.2 కోట్లకు చేరుకుందన్నారు. అంటే జనాభా రెట్టింపు అయిందన్నారు. కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.
ఆహార ధాన్యాలు, కూరగాయలు, పప్పు దినుసులు వంటి ఆహార వస్తు ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఆందోళన కలిగించే అంశమన్నారు. అలాగే, వ్యవసాయంలో ఉపాధి వాటా కూడా 72 శాతం నుంచి 52 శాతానికి పడిపోయిందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో సాగుభూమి, వ్యవసాయ జనాభా నిష్పత్తి ప్రతి వ్యక్తికి 11 హెక్టార్లు కాగా, మన దేశంలో మాత్రం ఇది 0.3 శాతంగా ఉందని మంత్రి పవార్ గుర్తు చేశారు.