దేశంలోని బాగా వెనుకబడిన రాష్ట్ర ప్రజలుగా గుర్తింపు పొందిన బీహారీలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. బీహారీ ప్రజలపై మహారాష్ట్రలో జరిగిన దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ దాడులకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్థాక్రే మూలకారణమని అందరికీ తెల్సిందే.
తాజాగా ఇదే కోవలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ కూడా బీహారీలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టింది. దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహానే నాయకుడు కావడం గమనార్హం. పొట్ట చేతబట్టుకుని రాష్ట్రానికి వచ్చే బీహారీ ప్రజలకు ఉపాధి కల్పించరాదని ఆయన రాష్ట్రంలోని కంపెనీలను విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీల్లోని ఉపాధి అవకాశాల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. బీహార్ లేదా ఇతర ప్రాంతాలను నుంచి స్థానికేతరులకు ఉపాధి కల్పించం ఇకపై జరగ కూడదని అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సంతాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్థానిక యువకులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కేవలం ప్రభుత్వమే కాకుండా, ప్రైవేటు కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరారు. బీహారీలకంటే.. స్థానికులకే అవకాశం కల్పించాలని చెప్పారు.