శివసేన చీఫ్ బాల్థాక్రే వ్యాఖ్యలు పాకిస్థాన్ నేత మహ్మద్ ఆలీ జిన్నా మాటలను తలపిస్తున్నాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభిప్రాపడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్పై థాక్రే చేసిన విమర్శల పట్ల బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై బీసీసీఐ అధికార ప్రతినిధి, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ... మహ్మద్ ఆలీ జిన్నాలా బాల్థాక్రే మాట్లాడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే ఏ ఒక్క మరాఠీయుడు కూడా శివసేనకు మద్దతు పలుకరు. ఒక భారతీయుడిలా, జాతీయవాదిలా సచిన్ మాట్లాడారు. ఇవన్నీ వారికి అర్థంకావు. వారికి కొన్ని ఓట్లు కావాలి. అందుకే ఇలాంటి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు అని శుక్లా ఘాటుగానే విమర్శించారు.
మహారాష్ట్ర వాదులెవరూ ఇలాంటి చర్యలు లేదా వ్యాఖ్యలు చేయరు. కొంతమంది మాత్రమే ఇలాంటి వాటికి మద్దతు తెలుపుతారు. మెజారిటీ స్థాయి ప్రజలు ఇలాంటి వాటి పట్ల ఆసక్తి చూపరు. వీరంతా తొలుత భారతీయులుగానే ఉండాలని కోరుకుంటారన్నారు. ముంబై నగరంపై ప్రతి భారతీయునికి సమాన హక్కులు ఉన్నాయని సచిన్ చేసిన వ్యాఖ్యలపై బాల్థాక్రే మండిపడిన విషయం తెల్సిందే.
సచిన్ వ్యాఖ్యలు మరాఠీయుల మనస్సును గాయపిచేలా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా, రాజకీయాలు మాని ఆటపై దృష్టి కేంద్రీకరించాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీనిపై బీసీసీఐ వెంటనే స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు మహ్మద్ ఆలీ జిన్నా చేసేవారు. మహారాష్ట్ర వాసులే కాకుండా, దేశం యావత్తు, శివసేనకు చెందిన కొంతమంది నేతలు, రాజ్థాక్రే పార్టీ కూడా సచిన్ వెనుకనే ఉందని రాజీవ్ శుక్లా అన్నారు.