ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » చెరకు రైతుల ఆందోళన: ప్రధాని అత్యవసర సమావేశం (Sugarcane farmers | Sugarcane pricing policy | Manmohan Singh | cabinet meeting)
చెరకు మద్దతు ధరపై కేంద్రం ప్రవేశపెట్టిన విధానంపై ఉత్తరాది చెరకు రైతులు నిరసన తెలుపుతూ ఆందోళన చేపట్టారు. చెరకు గడలను చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధుల్లో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఢిల్లీలోని ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
చెరకు రైతుల ఆందోళన తీవ్రత దృష్ట్యా ప్రధాని మన్మోహన్ సింగ్ అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్, హోం మంత్రి పి. చిదంబరం పాల్గొన్నారు.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని గురువారం వెల్లడిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా రైతుల ఆందోళన కార్యక్రమానికి రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు అజిత్ సింగ్, భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన మహేంద్ర సింగ్ టికాయిత్ నేతృత్వం వహించారు.
అంతకుముందు కేంద్ర ప్రభుత్వం చెరకు క్వింటాలు ధరను రూ. 129. 85 పైసలుగా నిర్ణయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే ఈ ధర చాలా తక్కువని విపక్షాలు, రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని చెరకు కనీస మద్దతు ధరను రూ. 280- 400 మధ్య ఉండేటట్లు నిర్ణయించాలని డిమాండ్ చేశాయి.
ఎస్పీ నేత అమర్ సింగ్ ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయించిన చెరకు ధర వ్యాపారస్తులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనీ, అదే సమయంలో రైతులను కష్టాల్లోకి నెట్టి ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు.