ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గం సభ్యుల పనితీరుపై నివేదికను కోరారు. నవంబరు 30లోగా మంత్రులందరూ తమ పనితీరుపై తనకు నివేదికను సమర్పించాలని డెడ్లైన్ విధించారు.
ప్రధాని తన క్యాబినెట్ కార్యదర్శి చంద్రశేఖర్ ద్వారా మంత్రులందరికీ ఈ మేరకు లేఖలు పంపించారు. ఆయా మంత్రులు పంపించే నివేదికల ద్వారా వారి పనితీరు ఎలా ఉందన్న అంశంపై ప్రధాని సమీక్ష జరుపనున్నారు. తమ పనితీరుపై ప్రధాని నివేదిక కోరడాన్ని మంత్రులు స్వాగతించారు.
క్రీడా శాఖామంత్రి ఎమ్ఎస్ గిల్ మాట్లాడుతూ... ప్రధాని నుంచి తనకు లేఖ రాగానే నివేదికను పంపుతానన్నారు. మహారాష్ట్ర మాజీముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ సైతం ప్రధానమంత్రి నివేదిక కోరడాన్ని స్వాగతించారు. యూపీఎ పనితీరుకు ఇది దర్పణంలా ఉంటుందని వ్యాఖ్యానించారు.
అయితే కేంద్రమంత్రి ఫరూక్ అబ్దుల్లా మాత్రం మరొకరకంగా స్పందించారు. నివేదికలో మంత్రులు వారివారి పనితీరును ఘనంగా చెప్పుకున్నప్పటికీ, ఏయే మంత్రులు ఎలా పనిచేస్తున్నారన్నది ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. అయితే ప్రధానమంత్రి మంత్రుల పనితీరును సమీక్షించడం ద్వారా ప్రభుత్వ పనితీరు మరింత పటిష్టంగా ఉంటుందన్నారు.
చెరకు మద్దతు ధర విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురు కావడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ప్రతిపక్షాలు విజయం సాధించడం ప్రధానికి ఏమాత్రం రుచించలేదు. అందువల్లనే మంత్రివర్గ సభ్యుల పనితీరును ఆయన సమీక్షించాలనుకుంటున్నట్లు సమాచారం.