అమేథీలోని ముషింగంజ్ అతిథి గృహానికి వెళుతున్న ప్రియాంకా గాంధీ వాధ్రా వాహనాన్ని ఒక ప్రైవేటు వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మికులు కొందరు అడ్డుకున్నారు. తాము పనిచేస్తున్న కంపెనీ గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనీ, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
దీంతో ప్రియాంకా గాంధీ కార్మికుల అనునయించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సుమారు 800 మంది కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారు తెలిపారు.
జీతాల విషయాన్ని తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీ దృష్టికి తీసుకవెళతానని ప్రియాంక హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే రాహుల్ గాంధీతో ఈ విషయాన్ని చెప్పామనీ, ఫలితం కానరాలేదని కార్మికులు ప్రియాంకతో తమ గోడును వెళ్లబుచ్చారు. తమ జీతాల సమస్యను తెలుపుతూ యూపీఎ చైర్ పర్సన్ సోనియాగాంధీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.